సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
1 min read
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
‘ప్రజా ఫిర్యాదుల’ స్వీకరణకు 21 అర్జీలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగర ప్రజల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులకు సూచించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య ప్రాంతాన్ని సందర్శించినప్పుడు సమస్యను పూర్తిగా గ్రహించి, పరిష్కారం కనుగొనడం సులభమవుతుందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్దేశిత గడువులోపు శాశ్వతంగా పరిష్కరించి, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచుదామని కమిషనర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ జునైద్, ఎస్ఈ రమణమూర్తి, కార్యదర్శి నాగరాజు, ఏసిపిలు శబ్నం శాస్ర్తీ, నాగరాజు, ఆర్వోలు వాజిద్, క్రిస్టోఫర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


