మంత్రి టీజీ భరత్ చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడకండి..
1 min read
ఏపీ ఎన్జీవో సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు రామయ్య
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలులో మంత్రి టీజీ భరత్ చేస్తున్న అభివృద్ధికి అడ్డుపడకండని ఏపీ ఎన్జీవో సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు రామయ్య అన్నారు. నగరంలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూల్ నగరంలోని ఏ, బి, సి క్వార్టర్ల విషయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై కొందరు పనిగట్టుకుని చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. నగరంలో ఎంతో విలువైన ఏ బి సి క్వార్టర్లలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు, అలాగే కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. నగరంలోని ఏ ,బి, సి క్వార్టర్లలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు వాటిని ఇతరులకు ఇచ్చి అద్దెలు వసూలు చేస్తున్నారని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కొంతమంది కబ్జా చేసి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఏ బి సి క్వార్టర్లలో ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు ఇతర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కర్నూల్ నగరానికి నూతన శోభ చేకూరుతుందని చెప్పారు.

