శ్రీ జోగుళాంబా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్
1 min read
కర్నూలు ,న్యూస్ నేడు : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూర్ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పట్టువస్త్రాలను సమర్పించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ అమ్మవారిని,స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం తో తీర్థప్రసాదాలను అందజేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పాటిస్తూ, జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు..స్వామి, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.కలెక్టర్ వెంట దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ బి.సుధాకర్ రెడ్డి, అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


