ఆస్పరిలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆస్పరి మండలంలోని జగనన్న కాలనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆదేశాల మేరకు ఆస్పరి మండల కన్వీనర్ బసవరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ఆర్ తన పాలనలో రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయలకే బియ్యం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు పావలా వడ్డీ, సాగునీటి కోసం జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగించిన అరుదైన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ ప్రజల సంక్షేమ పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సొసైటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, యువజన నాయకులు, గ్రామాల ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పించారు.

