ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నెం ధర్మవరం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి బాదితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిల్లి స్వాతి డ్వాక్రా గ్రూపులో గ్రూపు లీడర్లు, ఆర్.పి.ల అవినీతిని ప్రశ్నించినందుకు 2023 మే నెలలో వైసీపీ నేతలు గెడ్డేటి సురేంద్ర, గెడ్డేటి ఝాన్సీ అనుచరులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడిలో తన మెడలోని 30 గ్రాముల బంగారు తాళిబొట్టు గొలుసును దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పొలం సమస్యలు పరిష్కరించాలని పలువురు మంత్రికి వినతిపత్రాలు అందించారు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు. వీటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు.


