ఏలూరు జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా రూపొందించాలి…
1 min read
మాదకద్రవ్యాల సమాచారం తెలిసిన వెంటనే నేషనల్ డెడికేషన్ హెల్ప్ లైను నెంబరు 14446,ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972 లకు తెలియజేస్తే తక్షణ చర్యలు
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి
మాదకద్రవ్యాల సేవిస్తే భవిష్యత్తు అంధకారమాయమనే విషయంపై ప్రతీ పాఠశాల, కళాశాలల్లో అవగాహన కలిగించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మాదకద్రవ్యాల జోలికి వెళితే భవిష్యత్తు అందకరమయమని, యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం మాదక ద్రవ్యాలు నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుపై ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను తీర్చిదిద్దు కునేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు జోలికి వెళ్ళితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మన జిల్లాను మార్చడానికి అందరి బాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు.యువత మాదకద్రవ్యాలు జోలికి పోకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవనని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, వినియోగం, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలకు, పాస్ పోర్ట్ ల జారీకి అనర్హతతో పాటు శాశ్వత క్రిమినల్ రికార్డు కలిగి ఉంటారని, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుతుందన్నారు. ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసే పోస్టర్ల ద్వారా మరియు క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రధానకూడళ్లలో ఫ్లెక్స్ లు ఏర్పాటుచేయాలని, ఆర్టీసీ బస్సులు, పాఠశాలలు, కళాశాలల్లో పోస్టర్లు ప్రదర్శించాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్దాలపై, పోక్సో చట్టంపై పాఠశాల స్థాయిలో క్విజ్ వంటి పోటీలు నిర్వహించి మరింత అవగాహన పెంచాలన్నారు.పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు సేవిస్తున్నా, సరఫరా,రవాణాదారుల సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోనుచేసి సమాచారం అందించవచ్చన్నారు. ఇటువంటి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వై. ప్రసాదరావు, జిల్లా ఉప రవాణా కమీషనరు యస్.కె.కరీం, ఆర్&బి శాఖ యస్ఇ కె.విజయ రత్నం, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.యు.శోభ, జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి యస్.బి. శేఖరు, విభిన్న ప్రతిభా వంతులు శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్,ఎన్టిఆర్ వైద్యసేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా:రాజీవ్ , జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నమ్,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి వై.విశ్వమోహన్ రెడ్డి, డిఎస్పి డి.శ్రావణ్ కుమార్, ఈగిల్ టీమ్ ఇంచార్చి బి.ఉదయ భాస్కర్, డీసీపీఓ సూర్యచక్రవేణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


