ప్రతి మహిళా ఒక పారిశ్రామికవేత్త కావాలి…జిల్లా కలెక్టర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : స్వయం సహాయక సంఘాల లోని ప్రతి మహిళా ఒక పారిశ్రామికవేత్త కావాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లో మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు బిస్మిల్లా పొదుపు లక్ష్మి గ్రూప్, షాజహాన్ ఎస్ హెచ్ జి, శ్రీ మణికంఠ ఐక్య మహిళా సంఘం, గాంధీ పొదుపు లక్ష్మి గ్రూప్ మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 100 మంది మహిళలలో ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా ఎంపికయిన సందర్భంగా వీరంతా జిల్లా కలెక్టర్ ను కలిశారు. వారి వ్యాపారాలను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి హైదరాబాద్లోని జేఎన్టీయూ క్యాంపస్లో నాలుగు రోజుల రెసిడెన్షియల్ శిక్షణను ఏర్పాటు చేస్తోంది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహిస్తోందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలని కలెక్టర్ వారిని ఉత్తేజపరిచారు. ఆయా సంఘాల మహిళలు చేస్తున్న వ్యాపారాలు, టర్నోవర్ లాభం తదితర విషయాలను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత సాధించి సమాజంలో ప్రముఖులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

