సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ అందుకోవాలి
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
43వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సంక్షేమ పథకాలను హక్కుగా సాధించేందుకు అర్హులైన ప్రతిఒక్కరూ ఆయా పథకాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. అవగాహనతోనే ప్రభుత్వ పథకాలను సునాయాసంగా పొందగలమనే విషయాన్ని అర్హులైనవారు గ్రహించాలని ఆయన హితవు పలికారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఇదేక్రమంలో స్థానిక 43వ డివిజన్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన తొలిఅడుగు కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక మహిళలతో మాట్లాడీ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా అవగాహనతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల లబ్ది వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ల ద్వారా తెలుసుకొవచ్చునని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తల్లికి వందనం, ఇళ్ళ కేటాయింపు వంటి పథకాల్లో అర్హులు పూర్తి వివరాలను యాప్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. ఇంటి స్థలాల కేటాయింపునకు కూడా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తామన్నారు. గత వైసిపి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మాయా ప్రపంచాన్ని సృష్టించీ, స్థలాలు కేటాయించినట్లుగా డ్రామాలాడిందనీ, దీనివల్ల అర్హుల విలువైన ధనం వృదాగా ఖర్చైందన్నారు. ప్రస్తుతం అటువంటి విధానాలకు చెల్లుచీటి ఇస్తూ అత్యంత పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు వలీ, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.


