దిగ్విజయంగా ముగిసిన “ఉచిత కంటి వైద్య” శిబిరం!
1 min read
91 మందికి కంటి ఆపరేషన్లు, 868 మందికి వైద్య పరీక్షలు
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం దిగ్విజయంగా ముగిసిందని పూర్వ విద్యార్థులు అడ్వకేట్ సురేష్ కుమార్, సీనియర్ లెక్చరర్ వీరేశప్ప తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరం యందు కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారికి సలహాలు, సూచనలను ఆసుపత్రి నిర్వాహకులు అరుల్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. బెంగళూరు చిట్టెం హనుమాన్ ప్రసాద్, చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో అత్యాధునిక పరికరాలతో తొమ్మిది రోజుల నుండి కంటి వైద్య పరీక్షలు మరియు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి పత్తికొండ డివిజన్ చుట్టుపక్కలే కాక కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, డోన్, గుంటకల్ చుట్టు పక్కల గ్రామాలతో పాటు రాయచుర్ నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారని పేర్కొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో 868 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా, 91 మందికి కంటి ఆపరేషన్లను డాక్టర్ నివేదిత, డాక్టర్ సెమిమేరీ లు చేశారని వివరించారు. కంటి ఆపరేషన్లకు వచ్చిన ప్రజలకు డిటైర్డ్ టీచర్ ఏ.వరలక్ష్మి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఇలియాస్ భాష, వివిఆర్ గ్రాండ్ లాడ్జి ప్రొప్రైటర్ నాగరాజు, టీచర్ పందికోన మహేష్ లు అన్నదానం నిర్వహించారు. కంటి ఆపరేషన్లు చేయించుకున్న ప్రతి ఒక్కరూ శనివారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గరకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


