దళితులపై దాడులు ఆపకపోతే ప్రతి దాడులు చేస్తాం
1 min read
హెచ్చరించిన దళిత నాయకులు
పల్లెవెలుగు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలోని బొందిమడుగుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం రమేశ్ వాకింగ్ చేస్తుండగా.. దుండగులు ట్రాక్టర్తో ఢీ కోట్టి అతి దారుణంగా చంపడం చాలా బాధాకరమైన విషయం అని మాజీ నక్సలైట్ హెచ్. వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల తిరుపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డుపై బేటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,ఈ ఘటన తర్వాత దళితులపై హత్యలు, దాడులు, అణచివేతలపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి అని, స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలైన తరువాత కూడా దళితులు ఇంకా సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. ఇకపై దళితుల జోలికి వస్తే దాడులకు ప్రతి దాడులకు తెగపడక తప్పదని హెచ్చరించారు. అగ్రవర్ణాల కుల దురహంకారానికి ఈ సంఘటన సాక్ష్యం అని, దళితులపక్షంగా పోరాడే నాయకులు, దళితుల హక్కుల కోసం, దళితుల ఆస్తుల రక్షణ కోసం మాట్లాడే నేతలను లక్ష్యంగా దళితేతరులు దాడులు చేస్తున్నారని ప్రాణాలు తీస్తున్నారని ధ్వజం ఎత్తారు. జిల్లాలో దళితుల గొంతుకగా అణగారిన వర్గాల హక్కుల గురించి మాట్లాడే నేతగా ముందు వరసలో ఉండే బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ హత్య దళిత సమాజంపై అగ్రవర్ణాల గొడ్డలిపోటు అని పేర్కొన్నారు.

