మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల ఏర్పాటుకు స్థలం లేదనడం హాస్యాస్పదం
1 min read
– ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గానికి మంజూరైన మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే తన సొంత గ్రామానికి తరలించడం పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేయడమేనని ఏఐఎస్ఎఫ్ నాయకులు నజీర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అనుమేష్ అన్నారు. సోమవారంస్థానికంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను పత్తికొండకు మంజూరు చేసిందన్నారు. అలాంటి పాఠశాలకు స్థలం లేదనే కారణం చూపి ఎమ్మెల్యే గారి సొంత గ్రామానికి తరలించకపోవాలని ఆలోచన దురదృష్టకరమని వారన్నారు.పత్తికొండలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని గుర్తించి పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే గారు తన సొంత గ్రామానికి తరలించే ప్రయత్నం చేయడం ప్రజా వ్యతిరేక చర్య అని విమర్శించారు.పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గురుకుల పాఠశాలను పత్తికొండలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే గారు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సిద్దు, ఏఐవైఎఫ్ నాయకులు పెద్దయ్య, అల్తాఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


