జలధార-జలహారతి కాలువ పనులకు శ్రీకారం
1 min read
కలెక్టర్ ఆమోదంతో కాలువ పునరుద్ధరణకు శ్రీకారం..
నంద్యాల న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మహానంది మండలంలోని అబ్బిపురం గ్రామంలో“జలధార-జలహారతి”కార్యక్రమం కింద ఉప కాలువ పునరుద్ధరణ పనులు వారం రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ కాలువను పునరుద్ధరించాలనే రైతుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఈ పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేశారు.రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని,సాగునీటి కొరత కారణంగా పంటలు దెబ్బతింటున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ఈ కాలువ పునరుద్ధరణ అత్యవసరమని భావించి వెంటనే చర్యలు తీసుకున్నారు.ఆమె ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పనులను ప్రారంభించారు.ఈ చర్యలతో గ్రామ రైతుల్లో నమ్మకం పెరిగి, త్వరలోనే తమ పొలాలకు నీరు అందుతుందనే ఆశాభావం నెలకొంది.మందా రామకృష్ణ పొలం నుండి ఈర్ణ సునిత గారి పొలం వరకు సాగుతున్న ఈ పనులు రూ.2,31,966 వ్యయంతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 730 మ్యాండేస్ ఉపాధి కల్పించబడుతోంది.పనులు పూర్తయిన తర్వాత తెలుగుగంగ కాలువ 9వ బ్లాక్ నుండి నీరు సాఫీగా ఈ కాలువలో ప్రవహించేలా చర్యలు చేపడుతున్నారు.ఈ కాలువ ద్వారా ముందుగా బుక్కాపురం గ్రామంలోని బొల్లవానికుంటకు నీరు చేరి, అక్కడి నుండి నంద్యాల మండలం ఎ. కోడూరు గ్రామం వరకు సాగునీరు అందనుంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణం గల బొల్లవానికుంట కూడా నిండిపోవడం వల్ల పరిసర ప్రాంతాలకు అదనపు ప్రయోజనం కలుగనుంది. ఈ పనులు పూర్తయితే దాదాపు 32 మంది రైతులకు చెందిన 94 ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. ఇప్పటి వరకు వర్షాలపై ఆధారపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇది గొప్ప ఊరటనివ్వనుంది. కాలువలో నీరు ప్రవహించడం ప్రారంభమైతే రైతుల పొలాలు పచ్చగా కళకళలాడుతూ మంచి దిగుబడులు అందించనున్నాయి.జిల్లా కలెక్టర్ సమయోచిత నిర్ణయం వల్ల ఈ పనులు ప్రారంభమవడం గ్రామాభివృద్ధికి కీలకంగా మారింది.“జలధార – జలహారతి”కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరులు మెరుగుపడుతూ రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నాయి.అబ్బిపురం గ్రామానికి చెందిన రైతు పాలుస్వామి మాట్లాడుతూ తమ గ్రామంలో చేపడుతున్న తెలుగు గంగ కాలువ పూడికతీత పనులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు.


