పోలకల్ గ్రామంలో జాయింట్ కలెక్టర్ పర్యటన
1 min read
‘ఎస్.ఐ.ఆర్ డోర్ టు డోర్’ ఓటరు సర్వే ప్రక్రియ తనిఖీ, డిజిటైజేషన్ ప్రక్రియపై సమీక్ష, రేషన్ షాప్ ఆకస్మిక తనిఖీ, పరిశీలన.డిజిటైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బి.ఎల్.ఓ లకు ఆదేశాలు.రేషన్ కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన షెడ్యూల్డ్ సరుకులను సకాలంలో అందించాలి : జేసీ
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలోని సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ నేడు పర్యటించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) డోర్-టు-డోర్ ప్రక్రియను స్వయంగా పరిశీలించడంతో పాటు, పౌరసరఫరాల చౌక ధరల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న ‘ఎస్.ఐ.ఆర్ డోర్ టు డోర్’ ఓటరు సర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులతో (బి.ఎల్.ఓ), స్థానిక ఓటర్లతో ఆయన మాట్లాడారు. సర్వే ప్రక్రియ ఎలా సాగుతోంది, ఫామ్ల అప్లోడింగ్ యాప్ పనితీరు ఎలా ఉందనే అనే అంశాలపై ఆరా తీశారు. డిజిటైజేషన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బి.ఎల్.ఓ లకు జేసీ నూరుల్ ఖమర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అనంతరం రేషన్ షాపును సందర్శించిన జాయింట్ కలెక్టర్.. షాపులోని నిల్వలను (స్టాక్) క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన రేషన్ కార్డుదారులతో నేరుగా సంభాషించి, సమయానికి నాణ్యమైన సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బియ్యం, పప్పు తదితర నిత్యవసర వస్తువుల సరఫరా తీరుపై కార్డుదారులను ప్రశ్నించారు. అనంతరం, కార్డుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యమైన షెడ్యూల్డ్ సరుకులను సకాలంలో అందించాలని షాపు డీలర్ను జేసీ ఆదేశించారు.

