కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి – సీపీఐ ధర్నా
1 min read
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, హోళగుంద మండలంలోని అన్ని గ్రామాలను కరువు గ్రామాలుగా గుర్తించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో సోమవారం హోళగుంద తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి బీ. మారప్ప మాట్లాడుతూ, వర్షాభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం అందించాలని, బ్యాంకుల్లో తీసుకున్న రూ.2 లక్షల వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు కుటుంబానికి 10 నెలల పాటు నెలకు రూ.20 వేల కరువు పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రంగన్న, రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్. కృష్ణయ్య, మండల నాయకులు సలాం సాబ్, హినహిత్ తదితరులు పాల్గొన్నారు.


