మే 31 ఛలో సిద్దేశ్వరం….
1 min read
రాయలసీమ సాగునీటి హక్కల సాధనే లక్ష్యంగా ప్రజా బహిరంగ సభ
వేలాదిగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి.
న్యూస్ నేడు నంద్యాల రూరల్ఉ : శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పెద్ద గోతి పడినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, అలుగునూర్ రిజర్వాయర్ తెగిపోయినా ,గోరుకల్లు రిజర్వాయర్ కట్టలు కుంగిపోయినా,తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లకు భద్రత లేకున్నా వాటి పటిష్ట భద్రతకై నేటి వరకు పాలకులలో ఏ మాత్రం చలనం లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9 వ వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి నంద్యాల జిల్లా సంగమేశ్వరంలో మే 31 న నిర్వహిస్తున్న ప్రజా బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా ఒక ప్రకటన విడుదల చేసారు. రాయలసీమలోని అనేక ప్రాజెక్టుల ప్రధాన కాలువల, ఉపకాలువల, పంట కాలువల, డిస్ట్రిబ్యూటరీల రూపురేఖలే లేకుండా చిద్రమైపోయినాయనీ,ప్రపంచ వారసత్వం సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు ఎంతవరకు ఇస్తారో భరోసా ఇచ్చే పరిస్థితులు లేకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల కిందట నిర్మాణం అయిన తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువల కింద హక్కుగా ఉన్న 4,36,000 ఎకరాల ఆయకట్టు భూమిలో కేవలం 1,30,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నేటికీ నీరు లభిస్తుండడం రాయలసీమ పట్ల పాలకుల వివక్షతకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.నాలుగు దశాబ్దాల కింద నిర్మాణం మొదలైన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యం వలన ఇంకా మూడు దశాబ్దాలైనా పూర్తి అయ్యే పరిస్థితులు లేకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాయలసీమలోని అనేక చెరువుల తూముల, అలుగుల, కట్టల అధోగతి పాలైనా వాటి మరమ్మత్తులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు.గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన పాలకులు నిర్మాణాలను ఎందుకు కొనసాగించడం లేదని అయన ప్రశ్నించారు. రాయలసీమను మభ్యపరిచే దిశగా “గోదావరి – బనకచర్ల” ను చేపట్టడమే కాకుండా, పదకొండేళ్ళ నుంచి ప్రత్యేక ప్యాకేజి నిధులను అడగకుండా మౌనంగా వున్న పాలకులు ఆ నిధులను “గోదావరి – బనకచర్ల” అనుసంధానానికి మళ్లించే దిశగా పాలకులు అడుగులు వేస్తున్నారని అన్నారు.ఇంకా ఎన్నేళ్లు మౌనంగా ఉందామనీ వెనకబడిన ప్రాంతాల నిర్లక్ష్యం పట్ల పాలకుల వైఖరిని ప్రశ్నించేలాగా ప్రజలందరూ చైతన్యవంతులవ్వాలని అన్నారు.రాయలసీమ ప్రగతి చేపట్టేలాగా పాలకులపై ఒత్తిడి తెద్దాంప్రతి గడప నుంచి సిద్దేశ్వరానికి కదులుదాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధన ఉద్యమంలో భాగస్వామ్యులవుదాం మే 31 న సంగమేశ్వరంలో జరిగే ప్రజా బహిరంగసభ విజయవంతానికై ప్రజలు వేలాదిగా తరలిరావాలని బొజ్జా ప్రజలకు పిలుపునిచ్చారు.