మొహర్రం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్సై నాగార్జున
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై నాగార్జున గ్రామ పెద్దలు, మత పెద్దలు, యువతకు సూచించారు. బుధవారం ఎన్.రంగాపురం, మెట్టుపల్లి, ఏనుగుమర్రి తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాలను ముందస్తుగా పోలీసులకు తెలియజేసి నిర్ణయించిన మార్గాల్లోనే నిర్వహించాలని కోరారు. మత విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేయరాదని హెచ్చరించారు. యువత ప్రమాదకర విన్యాసాలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్ల వినియోగాన్ని నివారించాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ముఖ్యంగా ప్యాపిలి గ్రామంలో మైనర్లు సరదా కోసం ద్విచక్ర లేదా ఇతర వాహనాలు నడిపితే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దన్నారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

