సర్ ప్రక్రియలో అప్రమత్తంగా పనిచేయాలి – ఆలూరు ఎమ్మెల్యే
1 min read
హాలహర్వీ మండలంలో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వీ మండల పరిధిలోని టీ.చాకిబండ, శ్రీధర్ హాల్, బేవినహాల్ గ్రామాల్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సర్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై ఉండాలని, బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రజా సమస్యల రూపంలో బయటకు తీసుకువచ్చి ప్రజల తరఫున పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లు తొలగించబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.రాబోయే రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని బుసినే విరుపాక్షి పేర్కొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కో-కన్వీనర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


