కంపు కొడుతున్న నందికొట్కూర్
1 min read
డంప్యార్డ్ను మార్చండి
కమిషనర్ కు వినతిపత్రం అందజేత..
నందికొట్కూరు న్యూస్ నేడు: డంప్ యార్డ్ వల్లనందికొట్కూరు పట్టణం కంపు కొడుతోందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డంప్యార్డ్నుతక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్తను నందికొట్కూరు డంప్యార్డ్కు తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కుమ్మరి పేట కాలనీవాసులు,యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో కుమ్మరి పేట, వాల్మీకి నగర్,పగిడ్యాల రోడ్డు మీదుగా పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కాలనీవాసులతో కలిసి ధర్నా చేపట్టారు.డంప్యార్డ్ వల్ల కాలనీల ప్రజలు దుర్వాసన,దుమ్ము,ధూళి, పొగతో చిన్నపిల్లలు, వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి చెత్తను నందికొట్కూరుకు తరలించి రీసైక్లింగ్ ప్రక్రియ చేపట్టడం వల్ల దుర్గంధం, దుమ్ము-ధూళి మరింత పెరుగుతున్నాయని ఇళ్లల్లోకి చెత్త దుమ్ము చేరుతోందని కుమ్మరి వీధి, వాల్మీకి నగర్,బైరెడ్డి నగర్, గాంధీనగర్,ఏబీఎం పాలెం, ఇందిరానగర్ కాలనీల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని డంప్యార్డ్ను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు.చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి ప్రజల ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణ కోసం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.సమీవుల్లా,షేక్ లడ్డు, అబ్దుల్లా,సత్తార్,కలాం తదితరులు పాల్గొన్నారు.


