రైతులకు ఎరువుల పంపిణీలో కొత్త విధానం – అవగాహన కలిగి ఉండాలి
1 min read
మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్
హోళగుందన్యూస్ నేడు: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ తెలిపారు.ఈ విధానం ద్వారా రైతులు రైతు సేవా కేంద్రాలు లేదా ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాల ద్వారా యూరియా, డి.ఏ.పీ ఎరువులను పొందవచ్చన్నారు. ఎరువుల కోసం రైతులు కేవలం ఆధార్ కార్డు మాత్రమే తీసుకువస్తే సరిపోతుందని, భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే ధృవీకరణ సంకేత సంఖ్య నమోదు చేసిన అనంతరం రైతుల భూమి వివరాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా వారికి అర్హత ఉన్న ఎరువుల పరిమాణం వ్యవస్థలో కనిపిస్తుందని తెలిపారు.రైతులకు కేటాయించిన మొత్తం ఎరువులను మూడు విడతలుగా రైతు సేవా కేంద్రాలు లేదా ప్రైవేట్ విక్రయ కేంద్రాల ద్వారా పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఒకసారి యూరియా లేదా డి.ఏ.పీ తీసుకున్న రైతులు ఇరవై రోజుల తర్వాత మాత్రమే తదుపరి విడత ఎరువులను పొందగలరని తెలిపారు.రైతులకు పంపిణీ చేసిన ప్రతి యూరియా, డి.ఏ.పీ బస్తా వివరాలను అదే రోజు ప్రభుత్వ నమోదు వ్యవస్థల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ప్రైవేట్ ఎరువుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ హెచ్చరించారు.


