మహిళల రక్షణకు వన్ స్టాప్ సెంటర్ సేవలు
1 min read

బాధిత మహిళలకు ఒకే చోట అన్ని సహాయాలు.
ఆదోని లో వన్ స్టాప్ సెంటర్ ప్రారంభం.
ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్.
కర్నూలు, న్యూస్ నేడు: ఆదోని పరిసర ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలకు గురైన బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్ (One Stop Center – OSC) ద్వారా సమగ్ర సేవలు అందించబడుతున్నాయి. కుటుంబంలో, సమాజంలో, కార్యాలయాల్లో లేదా ఇతర ప్రజా మరియు వ్యక్తిగత ప్రదేశాల్లో హింసకు గురైన మహిళలకు ఒకే చోట అవసరమైన సహాయం అందించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం అని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం ఆదోని ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం అధికారులతో కలసి మహిళలకు అత్యవసర సహాయం అందించే ఉమెన్ హెల్ప్ లైన్ – 181 మరియు పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ – 1098 సేవలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలపై జరిగే అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా పోరాడేందుకు తక్షణ, అత్యవసర మరియు ఇతర అవసరమైన సేవలు అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు . ఈ కేంద్రం ద్వారా అత్యవసర స్పందన మరియు రక్షణ సేవలు, వైద్య సహాయం, మహిళలు FIR / NCR / DIR నమోదు చేయడంలో సహాయం, మానసిక-సామాజిక కౌన్సెలింగ్, న్యాయ సహాయం, అవసరమైన వారికి ఆశ్రయం, అలాగే వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం వంటి సేవలు అందించబడుతున్నాయి. వన్ స్టాప్ సెంటర్ సేవలు 18 సంవత్సరాల లోపు బాలికలు సహా అన్ని మహిళలకు అందుబాటులో ఉంటాయి. కులం, మతం, వర్గం, ప్రాంతం, లైంగిక అభిరుచి లేదా వివాహ స్థితి వంటి భేదాలు లేకుండా హింసకు గురైన మహిళలు ఈ సేవలను పొందవచ్చు అని తెలిపారు.ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ.. మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో రెండవ వన్ స్టాప్ సెంటర్ ను ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మొదటి వన్ స్టాప్ సెంటర్ కర్నూలులో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం 0 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల హింసకు గురైన మహిళలకు పునరావాసం, న్యాయ సహాయం, వైద్య సేవలు, పోలీసు సహాయం వంటి అన్ని అవసరమైన సేవలను ఒకే చోట అందించడం అని వివరించారు. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించి వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కల్పించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. ఈ సదుపాయాలపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే హింసకు గురైన మహిళలు 181 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని, పిల్లలకు సంబంధించిన సమస్యల కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సంప్రదిస్తే సంబంధిత సిబ్బంది వారి వద్దకు చేరుకుని అవసరమైన వైద్య మరియు ఇతర సహాయ సేవలు అందిస్తారని తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 10 వన్ స్టాప్ కేంద్రాలను ప్రారంభించారు. అందులో కర్నూలు జిల్లా ఆదోని లో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ కూడా ఒకటిగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సంక్షేమం మరియు భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశాన్ని ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) వారి ఆధ్వర్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి వీక్షించారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు అత్యవసర సహాయం, న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సెలింగ్ వంటి సేవలను ఒకే కేంద్రం ద్వారా అందించడమే వన్ స్టాప్ సెంటర్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి, హాస్పిటల్స్ సూపర్డెంట్ యం. నాగరాజు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

