నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణకు ఆదేశం
1 min read
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చంటి భరోసా
తల్లిని అవమానించిన వారిపై కఠిన చర్యలు
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువు మృతి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులను ఆదేశించారు. బాధిత తల్లిపై పత్రాలు విసిరి అవమానించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఘటన సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడానికి చెందిన గర్భిణి మూడు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ సరైన వైద్యం అందలేదన్న ఆరోపణలు తీవ్రంగా పరిగణిస్తున్నామని, నవజాత శిశువు మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించడంతో పాటు డీఎంఈ కార్యాలయానికి కూడా సమాచారం అందించామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు.


