3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
1 min read
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 03వ తేదీ (సోమవారం) జిల్లా వ్యాప్తంగా “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించబడుతుందని తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను నేరుగా కార్యక్రమంలో సమర్పించవచ్చని, అలాగే meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సమర్పించిన అర్జీల పరిష్కార స్థితిని అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన వినతులను ముందుగా మండల, రెవెన్యూ డివిజన్ లేదా మున్సిపల్ స్థాయి కార్యాలయాల్లో సమర్పించి, అక్కడ పరిష్కారం కాని అంశాలను మాత్రమే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా కేంద్రంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభమయ్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


