అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయండి
1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇసుక రవాణాను పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు… హంద్రీ, తుంగభద్ర ఇసుక రీచ్ ల వద్ద అక్రమ ఇసుక రవాణా కు సంబంధించి పత్రిక లలో ప్రతికూల వార్తలు వస్తున్నాయని, రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీ చేస్తున్నారా, లేదా అని కలెక్టర్ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆరా తీశారు.అక్రమ ఇసుక రవాణా పై వస్తున్న వార్తలపై వెంటనే స్పందించి పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెళ్లి తనిఖీ చేసి కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ విఆర్ఓ లు సమాచారం ఇవ్వకుండా ఉన్నట్లయితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు అక్రమ ఇసుక రవాణా కు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికలు పంపాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు.సమావేశంలో డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు టౌన్ డి.ఎస్.పి బాబు ప్రసాద్, ఆర్టీవో భరత్, మైనింగ్ అధికారి రవి చంద్, భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఈ కిషోర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ నాగేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

