NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఏపీ అభివృద్ధి కి  గేమ్ చేంజర్ గా మారనుంది

1 min read

ఏలూరు యమ్ ఎల్ ఎ బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విశాఖలో గూగుల్‌ సెంటర్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌, అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అంతేకాకుండా గూగుల్‌ రాకతో విశాఖపట్నం ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌ కృషివలనే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే బడేటి చంటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్‌ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్ర ప్రదేశ్‌కు శుభపరిణామమని, ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాప్ట్‌ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్‌ను చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి చేశారో, విశాఖకు గూగుల్‌ను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రాన్ని మార్చనున్నారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉండడం వలనే గూగుల్‌, టిసిఎస్‌, అక్సెంచర్‌ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ 16 నెలల్లోనే 11.20లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటూ, 9.5లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా, వారి అభివృద్ధికి బాటలు వేసేలా గూగుల్‌ వంటి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప దార్శనీకుడని ఆయన కొనియాడారు. 55వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌత్‌ అసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు కావడం రాష్ట్రాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పెట్టుబడిదారులను అడ్డుకునేందుకు దుష్టశక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని ఆయన స్పష్టం చేశారు.

About Author