కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ సమస్యలు తీరుస్తాం
1 min read

అన్ని వైద్య విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు మంచి వైద్యం అందించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి.
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ లలో ఉన్న సమస్యలు తీరుస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.బుధవారం సాయంకాలం మెడికల్ కాలేజ్ సమావేశ మందిరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అన్ని వైద్య విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి అన్ని వైద్య విభాగాలలో ఉన్న సమస్యలను, వసతులు, పరికరాల లభ్యత తదితర విషయాల గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతులు ఏర్పాటు చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తో చర్చించి సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ ,జిజిహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ,కంటి ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర రెడ్డి, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ లు సాయి సుధీర్, డాక్టర్ హరి చరణ్, జి జి హెచ్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం , అన్ని శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లు ప్రొఫెసర్లు, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజనీర్ లు , డాక్టర్లు పాల్గొన్నారు.


