ఉపాధి హామీ పనులు ఎక్కడ…
1 min read

ఉపాధి హామీ పథకం నిర్విర్యానికి కుట్ర…. వ్యవసాయ కార్మిక సంఘం ఆరోపణ
న్యూస్ నేడు, పత్తికొండ: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పనులు ఎక్కడని.. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్పుతో పాటు నిబంధనల పేరుతో నిధుల కొరత తో నిర్వీర్యం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలతో ఐక్య పోరాటాల నిర్వహిస్తుందని ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నాడు పత్తికొండ పట్టణంలోని కామ్రేడ్ ఈశ్వరరెడ్డి భవన్ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బి.వీర శేఖర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ముమ్మరమైన వేసవిలో జిల్లాలో లక్షకు పైగా కూలీలు పనిచేయాల్సిన ఉండగా జిల్లావ్యాప్తంగా కూలీల హాజరు 10 వేలకు మించడం లేదని దీనికి ప్రభుత్వాలు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేస్ యాప్ మరియు నిబంధనలు బూచిగా చూపెట్టి ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉన్న చోటే ఉపాధి కల్పించే గ్రామ గ్రామ సీమలలో తల్లి లాంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి పేదలను మరింత పేదలుగా చేసే కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకంతో పేదలలో ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం వచ్చిందని, ప్రభుత్వాలు మరొక్కసారి ప్రజలను బానిసలుగా చేసే విధానాల వైపు మల్లుతున్నారని విమర్శించారు జిల్లాలో వెంటనే అడిగిన వారందరికీ పని కల్పించాలని డిమాండ్ చేశారు .

