దెందులూరు నియోజకవర్గంలో మిన్నంటిన హనుమాన్ జయంతి సంబరాలు
1 min read
పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
నాయుడుగూడెం,చాటపర్రు గ్రామాల్లో వేడుకల్లో సైతం పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని
నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి ప్రార్థన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హనుమత్ నామస్మరణతో దెందులూరు నియోజకవర్గం మారుమోగింది. వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ వివిధ గ్రామాల్లో పర్యటించి, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అప్పన్నవీడులో ఆధ్యాత్మిక శోభ: దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ముందుగా పెదపాడు మండలం అప్పన్నవీడు (హనుమాన్ జంక్షన్) లోని ప్రముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా విరాజిల్లాలని కాంక్షిస్తూ స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేక క్రతువుల్లో పాల్గొన్నారు.
నాయుడుగూడెం, చాటపర్రు పర్యటన: అనంతరం పెదపాడు మండలం నాయుడుగూడెంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరియు ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని హారతి ఇచ్చారు. భక్తుల కోర్కెలు తీర్చి, ధైర్యాన్ని విజయాన్ని అందించే శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఆయా ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్ కి ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక కూటమి నాయకులు మరియు గ్రామస్తులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు జ్ఞాపికలను అందజేశారు.ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


