ప్రభుత్వ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణలో ప్రజల భాగస్వామ్యం
1 min read
ఈనెల 18 నుంచి 25 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం
జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమంపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో ఈనెల 18 నుంచి 25 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు అమలు, పర్యవేక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా 18.05.2026 నుండి 25.05.2026 వరకు జన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా అవగాహన శిబిరాలు, గ్రామ సమావేశాలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పరస్పర చర్చా కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ శాఖలు మరియు ప్రజల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. జన్ భాగీదారి అభియాన్ కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు హక్కులపై విస్త్రృతంగా అవగాహన కల్పించాలన్నారు.సామాజిక మరియు ఆర్థిక భద్రతకల్పించేందుకు పీఎం-కిసాన్ యోజన ,సామాజిక భద్రత పెన్షన్ పథకాలు ,బీమా పథకాలు ,నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ వంటి కార్యక్రమాలు నమోదు చేయాలన్నారు. సమగ్ర గిరిజన సాధికారత కింద పీఎం-జన్మన్ (PM-JANMAN) , ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ వంటి ముఖ్య పథకాల చివరి దశ అమలుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలవాలన్నారు. అదే విధంగా గిరిజన సాంస్కృతిక సమగ్రతను పెంపొందించేందుకు సాంప్రదాయ గిరిజన కళారూపాలు , స్థానిక గిరిజన భాషలు పరిరక్షణ ప్రోత్సహించాలన్నారు. గిరిజన నాయకులు, ముఖ్యంగా భగవాన్ బిర్సా ముండా (“ధర్తి ఆబా”)ని స్మరించుకోవడం చేయాలన్నారు.


