పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
1 min read
ఆటో కార్మికుల సమస్యలపై గళ మెత్తిన ఏఐటీయూసీ, సిఐటియు
న్యూస్ నేడు, పత్తికొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, అలాగే ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ, ఏఐటియుసి సిఐటియుల ఆధ్వర్యంలో మంగళవారం పత్తికొండ పట్టణంలో భారీగా ర్యాలీ చేపట్టారు. పత్తికొండ పట్టణంలోని సవరమా గుడి, అంబేద్కర్ సర్కిల్ నుండి స్థానిక నాలుగు స్తంభాల కూడలి మీదుగా వ్యవసాయ మార్కెట్ వరకు ఆటో కార్మికులు ర్యాలీగా నిర్వహించారు. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని, అలాగే, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ (AITUC), సీఐటీయూ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్లను నినాదాలు చేశారు. పత్తికొండ టౌన్ ఆటో కార్మికుల సమస్యలపై వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన సమావేశం ఆటో కార్మిక సంఘం మాజీ నాయకులు నరసన్న (జై సింహా) అధ్యక్షతన జరిగింది సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్రఏఐటీయూసీ కార్యదర్శి హెచ్. రంగన్న, ఏఐటీయూసీ అధ్యక్షుడు జి. నెట్టి కంఠయ్య ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిత్యం కష్టపడితే గానీ ఇల్లు గడవని ఆటో కార్మికుల జీవితాలు ఇంధన ధరల పెరుగుదల వల్ల రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు ఆటో విడిభాగాలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మరియు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ఆటో కార్మికుల కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని వారు పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వల్ల పత్తికొండ టౌన్ ఆటో సర్వీస్ 15 రూపాయలు లింక్ చార్జీ పెంచారని తెలిపారు.


