‘ థైరాయిడ్ ‘ పై అవగాహన అవసరం
1 min read
లాపరో స్కోపిక్ సర్జన్ డా. భార్గవ్ వ్యాస్,
మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు
కర్నూలు న్యూస్ నేడు: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 25న నిర్వహించే World Thyroid Day సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్యులు థైరాయిడ్ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ “Thyroid and Nutrition” అనే సందేశంతో సరైన పోషకాహారం థైరాయిడ్ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.ఈ సందర్భంగా జనరల్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్ డా. భార్గవ వ్యాస్ ఎ.ఎన్ మాట్లాడుతూ, థైరాయిడ్ గ్రంథి శరీరంలోని మెటాబాలిజం, శక్తి వినియోగం మరియు హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సరైన పోషకాహారం లేకపోవడం, ముఖ్యంగా అయోడిన్ లోపం, థైరాయిడ్ సమస్యలకు ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు.అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, మెడ వద్ద వాపు, ఒత్తిడి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. థైరాయిడ్ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులు మరియు జీవనశైలి మార్పుల ద్వారా సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు.ఈ సంవత్సరం థీమ్ ప్రకారం పోషకాహారం థైరాయిడ్ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వైద్యులు వివరించారు. అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే అధిక జంక్ ఫుడ్, అసమతుల్య ఆహారం మరియు ఒత్తిడి వంటి అంశాలు థైరాయిడ్ సమస్యలను పెంచే అవకాశం ఉందని హెచ్చరించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,“ప్రస్తుతం థైరాయిడ్ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. సరైన ఆహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు వైద్యుల సూచనలు పాటించడం ద్వారా థైరాయిడ్ సమస్యలను నియంత్రించవచ్చు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు” అని తెలిపారు.

