విపత్కర వేళ యువత సేవాభావంతో ముందుండాలి
1 min read
నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపు
గాలివానతో రోడ్లపై విరిగిన చెట్లను స్వయంగా సిబ్బంది తో కలిసి తొలగింపు
కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర అత్యవసర పరిస్థితుల సమయాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యల్లో ఎప్పుడూ యువత సేవాభావంతో ముందుండాలని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగి రహదారులపై పడిపోయినా ప్రదేశాలను ఆదివారం కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు. వెంకటరమణ కాలనీతో పాటు పలు కాలనీల్లో స్వయంగా విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా బళ్ళారి చౌరస్తా, కృష్ణనగర్, సి.క్యాంపు, బి క్యాంపు ప్రభుత్వ సముదాయాల ప్రాంతం, జోహరాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. వెంటనే గ్యాంగ్వర్క్ ఏర్పాటు చేసి, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విరిగిన చెట్ల తొలగింపు బాధ్యత ప్రధానంగా విద్యుత్ శాఖకు చెందినదైనా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది కూడా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పారిశుద్ధ్య, హార్టికల్చర్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం నుండే అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత సేవాభావంతో ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.సిబ్బంది వచ్చేంత వరకు ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు మునిస్వామి, రవి, రమేష్, హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

