ఆదర్శ కమ్యూనిస్టు బోడ వజ్రం మరణం పార్టీ కి తీరని లోటు
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్
నివాళులర్పించిన పార్టీ నాయకులు,మిత్రులు శ్రేయోభిలాషులు,పలు సంఘల నాయకులు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చింతలపూడి మండల సీనియర్ నాయకులు భూ పోరాట యోధులు బోడ వజ్రం అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం పాత చింతలపూడి గ్రామంలోని ఆయన స్వగృహంలో మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు ఏరియా పార్టీ సమితి కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్ పాత చింతలపూడి గ్రామానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం డేగా ప్రభాకర్ మాట్లాడుతూ బోడ వజ్రం నిరుపేద రైతు కుటుంబం నుండి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు,ఉద్యమాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు. అనంతర కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన అనేక ఉద్యమాలలో బోడ వజ్రం ప్రాతినిధ్యం వహించారని కొనియాడారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షునిగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేయడంలో బోడ వజ్రం కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్దత, నిజాయితీ కలిగిన కమ్యూనిస్టుగా తన తుది శ్వాస వరకు ఎర్ర జెండా వదలకుండా ప్రజల కోసం పనిచేసిన వజ్రం ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి ప్రజా సమస్యల పోరాటాలకు తీరని లోటని వారి కుటుంబానికి ఏలూరు ఏరియా సమితి నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన భౌతిక కాయానికి పార్టీ నాయకులు,మిత్రులు శ్రేయోభిలాషులు,పలు సంఘల నాయకులు నివాళులర్పించారు.


