సమాజాభ్యున్నతికి ధర్మమే పునాది
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ధర్మం అంటే వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశ శ్రేయస్సుకు మార్గదర్శకమైన జీవన విధానమని, ధర్మబద్ధమైన ఆలోచనలు, నైతిక విలువలు, పరస్పర గౌరవం, సేవాభావం ఉన్నచోటే శాంతి, సౌభ్రాతృత్వం, సర్వాంగీనాభివృద్ధి సహజంగా వికసిస్తాయని, ధర్మం వ్యక్తిని సద్గుణవంతునిగా తీర్చిదిద్దుతుందని, సద్గుణవంతులైన వ్యక్తులే ఆదర్శ కుటుంబాలను నిర్మిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఆస్పరి మండలం, డి.కోటకొండ గ్రామంలోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం స్థానిక భజన మండలి నిర్వహించిన భజనలు, స్వాత్మానందస్వామి చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో కె.గంగాధర రెడ్డి, డి.కె.హనుమంతు, కొండారెడ్డి, రామాంజనేయులు, అర్చకులు శ్రీనువాసులు, గోపాల్,రామిరెడ్డితోపాటు భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.


