కర్నూలులో “హైకోర్టు బెంచ్” ఏర్పాటు చేయాలి
1 min read
పత్తికొండలో న్యాయవాదుల తీర్మానం
న్యూస్ నేడు,పత్తికొండ: కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు కారప్ప, గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండ బార్ అసోసియేషన్ కార్యాలయం యందు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈనెల 9వ తేదీన బనగానపల్లి లో జరిగే బహిరంగ సభలో కర్నూల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో వెనుకబడిన కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయం అన్నారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారని వివరించారు. అందులో భాగంగా ఈ నెల 9, 10 తేదీలలో పత్తికొండ కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మల్లికార్జున, నాగేష్, హుళ్తేన్న , రవి ప్రకాష్, లక్ష్మన్న, ప్రసాద్, భాస్కర్, నెట్టేకల్లు, మునయ్య, వలి, సుధాకృష్ణ, అలీ, లెనిన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

