కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
1 min read
ఆగస్టు 6 నుండి సిపిఐ పాదయాత్రలు జయప్రదం చేయండి
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్,
సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ముఖ్య నాయకుల సమావేశం శాయన అభిలాష్ కుమార్ అధ్యక్షతన ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన ధరల భారాలను వేస్తూ కార్పోరేట్ కంపెనీల యజమానులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేశంలోని విద్యార్థి,యువత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక,రైతు,విద్యార్థి యువత వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 తేదీ నుండి ఆగస్టు 16వ తారీకు వరకు దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఆరవ తేదీ నుండి ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం,కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏరియా కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి గొర్లి స్వాతి జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


