ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం అవసరం
1 min read
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ, ఏపీవీబీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ వాల్మీకి
హోళగుంద న్యూస్ నేడు:కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీవై పార్టీ, ఏపీవీబీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ వాల్మీకి పాల్గొన్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు ఆహ్వానం మేరకు పార్టీలకతీతంగా వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లార్తి అర్జున్ వాల్మీకి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, అక్రమాలను అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.బీసీల అభివృద్ధి కోసం బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఐదు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినా, ప్రభుత్వం స్పందించకుండా బీసీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.ఇటీవల ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అరెస్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, చేయని నేరానికి రాజకీయ కుట్రలో భాగంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం న్యాయబద్ధం కాదని అభిప్రాయపడ్డారు. ఒక ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ ప్రజల భద్రత ఎలా ఉంటుందనే సందేహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు.అదేవిధంగా ఎన్నికల సమయంలో వాల్మీకి–బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి వాల్మీకి–బోయల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


