నందీశ్వరస్వామికి విశేషపూజ
1 min read

పల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: పుణ్యక్షేత్రంలోని నందీశ్వర (శనగల బసవన్న) స్వామికి ఆదివారం విశేష పూజలు చేశారు. త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విశేషార్చనలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు.

