వచ్చే నెల ఆఖరికి బయో మైనింగ్ పూర్తి చేయాలి
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: గార్గేయపురం డంప్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ ప్రక్రియ వచ్చే నెల ఆఖరి నాటికి పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు ఆదేశించారు. ఆదివారం ఆయన డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ గార్గేయపురం డంప్ యార్డులో కొన్నేళ్ళ క్రితం బయో మైనింగ్ ప్రక్రియను చేపట్టిందని, డంప్ యార్డులో 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలకు చెత్తా శుద్దీకరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికి 43 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలకు బయో మైనింగ్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. మిగిలిన 22 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను వచ్చే నెల ఆఖరికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రామెల్ యంత్రాన్ని వినియోగించుకొని చెత్తను నాలుగు పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తారని, ప్లాస్టిక్, ఇనుము, గాజు వస్తువులు, రాళ్లురప్పలను వేర్వేరు చేయడం జరుగుతుందన్నారు. కాగా అంతకుముందు కమిషనర్.. ఏ.క్యాంపు, బళ్ళారి చౌరస్తా, యస్.ఏ.పి. క్యాంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఏ.క్యాంపులో పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను గమనించిన కమిషనర్, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ టీ హోటల్ వద్ద అపరిశుభ్రంగా ఉండటంతో సంబంధిత హోటల్ నిర్వాహకుడిపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే యస్ఏపి క్యాంపు, బళ్ళారి చౌరస్తా వద్ద నూతన బైపాస్ రహదారిని కమిషనర్ పరిశీలించారు.కార్యక్రమంలో పారిశుద్ధ్య తనిఖీదారుడు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.