స్వాతంత్య్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
గౌతమి సమావేశ మందిరంలో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి జిల్లా కె. వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహాత్మాగాంధీజీ,వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, వంటి ఎందరో నాయకులతో కలిసి సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంలో పాల్గొని, జైలు జీవితాన్ని అనుభవించారన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలు ఆయనకు సర్దార్ బిరుదునిచ్చారన్నారు. తన 21వ ఏట గాంధీజీ పిలుపుమేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారని, మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం, తదితర ఉద్యమాలలో గాంధీజీ తో కలిసి నడిచారన్నారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న అని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, సూపరింటెండెంట్ చల్లన్న దొర, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు టి. వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, వసతిగృహ సంక్షేమ అధికారులు,ప్రభృతులు పాల్గొన్నారు.

