వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : పర్యావరణానికి హాని కలిగించే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరం లోని ఏ క్యాంప్ మున్సిపల్ పార్క్ లో జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాయు కాలుష్యం వల్ల మానవ ఆరోగ్యం తో పాటు పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం “క్లీన్ ఎయిర్” (స్వచ్ఛమైన గాలి) అన్న థీమ్ తో ఈ వారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని కలెక్టర్ పిలుపు ఇచ్చారు. పరిశ్రమల నుండి వెలువడే వాయువులు, వాహనాల నుండి వెలువడే పొగలు, వ్యర్థాలను కాల్చడం వంటి ప్రక్రియల ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుందని,వీటిని తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. దగ్గరి ప్రదేశాలకు వెళ్ళడానికి కాలి నడక, సైక్లింగ్ ను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, ఇంచార్జ్ ఎస్ ఈ శేష సాయి తదితరులు పాల్గొన్నారు.

