మోదెల గ్రామానికి సౌర విద్యుత్ వెలుగులు,ఆనందోత్సవాలతో గిరిజనులు
1 min read

శతాబ్ద కాలంగా విద్యుత్ కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల కల నెరవేరిన రోజు
జిల్లా అధికారులు జేసీ అభిషేక్ గౌడ్, యస్ సి సల్మాన్ రాజు ను కృతజ్ఞతలు తెలిపిన మోదెల గ్రామస్తులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: శతాబ్ద కాలంగా విద్యుత్ వెలుగులకు నోచుకోని గిరిజన గ్రామం ‘మోదెల’. తమ గ్రామంలో విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరితే, కొండదిగి రమ్మంటున్నారని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కు వినతిపత్రం పంపుతూ , తమ చిన్న గిరిజన గ్రామంలో కనీసం విద్యుత్ సౌకర్యం లేదని, రహదారులు లేవని కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ విషయంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. వీటిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్వయంగా అధికారులతో సమీక్షించి, ఆ గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందుగా గ్రామంలోని 23 ఇళ్లకు విద్యుత్ అందించేందుకు 12. 5 లక్షల రూపాయలతో 5 KWA గ్రిడ్ ను ఏర్పాటుచేసి ప్రతీ ఇంటికీ సౌర విద్యుత్ ను అందించారు. తమకు విద్యుత్ వెలుగులు అందించిన జిల్లా యంత్రాంగాన్ని కలిసి తమ కృతఙ్ఞతలు తెలియజేసేందుకు మోదెల గ్రామస్తులు సోమవారం ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలుకు విచ్చేసారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ను, విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు ను శాలువా, పూల మొక్కతో తో ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలను తెలియజేసారు.


