ప్రధానితో సమావేశానికి ఎంపికైన ఆర్యూ బయోటెక్నాలజీ విద్యార్థిని
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: “మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026” కార్యక్రమంలో భాగంగా గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశానికి ఎంపికైన రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె. శివకీర్తిని వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభినందించారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న “మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026” పోటీల ఫైనల్ రౌండుకు శివకీర్తి ఎంపికవడంపట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. దేశ యువతలో కేంద్రబడ్జెట్ 2026 – 27, ఆర్థిక అక్షరాస్యతలపట్ల అవగాహన కల్పించడంద్వారా విధాననిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ క్విజ్ తోపాటు, వ్యాసరచన పోటీలకు దేశవ్యాప్తంగా 12 లక్షలమంది నమోదు చేసుకున్నారని, అందులో తొలి రెండుదశలను దిగ్విజయంగా అధిగమించి శివకీర్తి ఫైనల్ రౌండుకు అర్హత సాధించిందని ఆయన వివరించారు. ఈ నెల 12 – 13 తేదీల్లో జరిగే ఫైనల్ రౌండుకు సంబంధించిన వేదికతోపాటు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ మంత్రిత్వశాఖనుండి వచ్చిన వర్తమానాన్ని శివకీర్తి వి.సి. కి అందించారు. ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శివకీర్తి ఎంపికవడం వర్సిటీకి ఎంతో గర్వకారణమని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్. భరత్ కుమార్ తోపాటు ఇతర అధ్యాపకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

