పేదల అక్షయపాత్ర అన్న క్యాంటీన్లు
1 min read

ఆర్ఆర్ పేట అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ఆశయ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల అక్షయపాత్రగా పిలవబడుతూ, నడుపుతున్న అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపుతూ వారికి ప్రీతిపాత్రంగా మారాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఏలూరు రామచంద్రరావు పేట సర్వీసు రిజర్వాయర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను శుక్రవారం టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తనిఖీ చేశారు. అక్కడ భోంచేస్తున్న వారిని అడిగి వివరాలు సేకరించారు. ఆహార పదార్థాలు నాణ్యతగా ఉన్నది, లేనిది తెలుసుకున్నారు. అనంతరం కూటమి నాయకులు, ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్ లో భోజనం చేశారు. ఆహార పదార్థాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ అన్న క్యాంటీన్ ను ఉదయం 450 మంది,మధ్యాహ్నం పూట 500 మంది,రాత్రి 200 మంది సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకునేందుకే తాను కూడా ఈరోజు అన్న క్యాంటీన్ తనిఖీ చేసి, భోజన పదార్థాలను స్వీకరించినట్లు చెప్పారు. ఇక్కడ సిబ్బంది యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నానని, వారికి మూడు నెలలకు ఒకసారి జీతం ఇస్తున్నట్లు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇకపై ప్రతినెల వారికి జీతం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీ రామారావు ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే అన్న క్యాంటీన్లను సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నట్లు బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అక్కినేని రాజా, కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్, డివిజన్ ఇంచార్జ్ పిల్లారి శెట్టి సంధ్యా సురేష్, టిడిపి నాయకులు ఈతకోట శ్రీనివాసరావు, ఆర్ ఎన్ ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

