ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా రూ30 లక్షల చెక్కుల పంపిణీ
1 min read
చెడు అలవాట్లకు లోను కాకుండా జీవితం కొనసాగించాలి
భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు , న్యూస్ నేడు : చెడు అలవాట్లకు లోను కాకుండా జీవితం కొనసాగించాలి,భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాలి అని కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురికి రూ.30 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి వారిని ఉద్దేశించి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు వారి వయస్సు 23 సంవత్సరములు నిండిన తర్వాత ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వంశీ , ఇందుప్రియ ( కవలలు ) లకు రూ 20 లక్షలు , దినేష్ ఒక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా వారి తో ఆత్మీయంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ వారి విద్య , ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం వారి ఉన్నత విద్యతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు లేనందువలన చెడు అలవాట్లకు లోను కాకూడదని మీ భవిష్యత్తును తీర్చుదిద్దుకొని భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ వారిని ఉద్దేశించి అన్నారు.అనంతరం కలెక్టర్ కోవిడ్ మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయి మాంటిసోరి స్కూలు లో చదువుతున్న సాహిత్య , రామ్ వర్ధన్ (అక్క , తమ్ముడు ) లతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. వారి భవిష్యత్తు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. అమ్మా , నాన్న లేకపోవడం చాలా బాధాకరంగా ఉంటుందని కానీ దృఢంగా ఎదగాలి , సంతోషంగా ఉండాలి అని వారికి తెలిపారు. ఇటీవల వివాహం చేసుకున్న ఇందుప్రియ ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి, పండ్లు శాలువాతో సత్కరించి , ఆమె దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. వంశీ తనకున్న పెన్సిల్ ఆర్ట్ తో గీసిన జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని కలెక్టర్ కు బహుకరించారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల పిల్లలకు ఆహారంలో చక్కెర అదనంగా ఇవ్వరాదు అన్న పోస్టర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ అధికారి విజయ మరియు జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద పాల్గొన్నారు.



