ఇరిగేషన్ శాఖాధికారులపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం
1 min read

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:జిలాల్లో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ లో గ్రామాలలో చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నమయ్య జిల్లాలో అమలు జరుగుతున్న ‘జలధార’ కార్యక్రమం రీతిలో జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు గ్రామాలలో నీటి వనరులలో మిగులు, లోటు నీటి నిల్వలపై చేపట్టవలసిన పనులకు సంబంధించి ప్రతిపాదనల గురించి కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించగా ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా ఉండేలా నీటి పరిరక్షణ కోసం ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, అటువంటి కార్యక్రమం అమలులో అధికారుల నిర్లక్ష్యం సహించరానిదన్నారు. జలధార కార్యక్రమం ద్వారా జిల్లాలోని గ్రామంలో నీటి సంరక్షణ పనులకు సంబందించి సవివరమైన ప్రతిపాదనలను సాయంత్రం నాటికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఓ అండ్ ఎం పనులకు సంబంధించి ప్రతిపాదనలు కూడా వెంటనే సమర్పించాలన్నారు. డికెన్స్ ఫార్ములాపై అవగాహన లేని జలవనరుల శాఖ ఇంజినీర్లు: వర్షపు నీటి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గరిష్ట నీటి విడుదల అంచనా ను లెక్కించడానికి ఉపయోగించే ‘డికెన్స్ ఫార్ములా ‘ గురించి జలవనరుల శాఖ ఇంజినీర్లను కలెక్టర్ ప్రశ్నించగా, ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. చేసే పనిమీద సరైన అవగాహన లేకపోవడం సరైన పద్ధతి కాదని, చేసే పనిమీద పూర్తి అవగాహన కలిగి ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేలా పనితీరును మెరుగుపరచుకోవాలని ఇంజినీర్లకు కలెక్టర్ హితవు పలికారు.కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవప్రకాష్, భూగర్భ జల శాఖ డిడి కోదండరావు, ఇరిగేషన్ శాఖ ఈఈలు, డిఈలు, ఏఈ లు పాల్గొన్నారు.


