చేనేత కళను పరిరక్షించేందుకు ప్రతీ ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలి
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో భాగమైన చేనేత కళను పరిరక్షించేందుకు ప్రతీ ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తున్నదన్నారు. నేతన్న సేవలో పధకంలో అర్హులైన ప్రతీ చేనేత కార్మికులకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నాయని, అంతేకాక చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. చేనేత సహకార సంఘాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతి లో భాగమైన చేనేత కళను సంరక్షించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ను కలెక్టర్ పరిశీలించారు.కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. శ్రీదేవి, జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి కె. అప్పారావు, అభివృద్ధి అధికారి బి. హనుమంతరావు, మేనేజర్ తుమ్మల సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి విశ్వమోహన్ రెడ్డి,బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత, గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, చేనేత సంఘాల ప్రతినిధులు గుంటూరు సత్యవతి, మారకా శివయ్య, పోలిన వీరాస్వామి, దొడ్డిపట్ల కోటిలింగం,, నరుని లక్ష్మారావు, దివి లక్ష్మి, ప్రభృతులు పాల్గొన్నారు.


