‘ పద్మశాలి’ల ప్రతిభకు పట్టాభిషేకం…
1 min read
పది, ఇంటర్మీడియేట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం..
- ఆకాశమే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించిన ఏపీ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య
కర్నూలు, న్యూస్ నేడు :విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని గుర్తించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని ఏపీ పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకట సుబ్బయ్య అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పది, ఇంటర్మీడియేట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన పద్మశాలిల ముద్దు బిడ్డలకు శాలువా కప్పి, మెమోంటో , బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ భద్రావతి భావనారుషి కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమనపల్లె వెంకట సుబ్బయ్య, సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకతి లక్ష్మి నారాయణ , జిల్లా గౌరవాధ్యక్షుడు గాజుల శంకర్, కార్యదర్శి రామయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పద్మశాలిలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివాలన్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసిన నేతన్నల నుంచి అతుకులు లేని జాతీయ జెండాను రూపొందించి పద్మశాలీలు ఎంతో ఘనత సాధించారని గుర్తు చేశారు. ఇక్కడ ప్రశంస పత్రాలు, మెమోంటోలు అందుకున్న ప్రతి విద్యార్థి .. భవిష్యత్ లో అత్యుత్తమ మార్కులు సాధించి.. ఉన్నత శిఖరాల్లో స్థిరపడాలని ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య ఆకాంక్షించారు. ఆ తరువాత సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకతి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పద్మశాలీలు రాజకీయంగా రాణించాలని సూచించారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సేవారంగంలో చేనేతలు ఎంతో ప్రాధాన్యత చాటుతున్నారని, భవిష్యత్ లోనూ చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియేట్ లో ఉత్తమ మార్కులు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వారికి మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7500, తృతీయ బహుమతి రూ.5వేలు, కన్సోలేషన్ బహుమతిగా రూ.2 వేలు అందజేసి, ప్రశంసపత్రాలు అందజేశారు. అంతకు ముందు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. మధ్యాహ్నం కులబాంధువులందరికీ అన్నదానం ఏర్పాటు చేసినట్లు పద్మశాలీ సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం కర్నూలు జిల్లా కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.




