స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక శిబిరాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జేసీ
1 min read
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు.ఆదివారం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్…నగరంలోని రామచంద్ర మిషన్ సమీపంలోని స్వర్ణవార్డు–47 సచివాలయం, కేంద్రీయ విద్యాలయ పాఠశాల, బిషప్ చర్చ్ సెయింట్ జోసెఫ్ పాఠశాల, సోమిశెట్టి నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని స్వర్ణవార్డు–47, అలాగే డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రత్యేక శిబిరాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలు సమర్పించే దరఖాస్తులు, అవసరమైన ధ్రువపత్రాలను నిబంధనల ప్రకారం పరిశీలించి వెంటనే సంబంధిత పోర్టల్లో డిజిటలైజ్ చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్లో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డులు, కాలనీల్లో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, నిర్ణీత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బి.ఎల్.ఓకు సహాయకులుగా ఐసీడీఎస్,మెప్మా, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల నుంచి సిబ్బందిని కేటాయించడం జరిగిందని, వారి సేవలను వినియోగించుకుని సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.ఈ తనిఖీలలో కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

