గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో వైభవంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు
1 min read
స్వామి వారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు ప్రజలు
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిది : మదనపల్లె పట్టణం లోని అనపగుట్ట లో గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగాయి. రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం గా గుర్తింపు పొందిన ఈ ఆలయానికి శుక్రవారం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కన్నుల పండుగగా ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ ఆలయం లో ఉదయం నుంచే ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వ హించారు. స్వామివారికి స్నాపనోత్సవం, వసంతోత్సవం, విశేష అలంకరణల తో పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కల్యాణోత్సవాన్ని అర్చకులు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నేత్రపర్వంగా జరిపించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టు కున్నాయి. అదే విధంగా ఉట్టి కొట్టే ఉత్సవం లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టే కార్యక్రమం భక్తులను ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన చిన్నారులకు, బహుమతులు, జ్ఞాపికలను అంద జేశారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక క్యూలైన్లు, మౌలిక వసతులు కల్పించారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వ హించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకలతో మదనపల్లె పట్టణం కృష్ణనామ స్మరణ తో మారుమోగింది.కాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయాన్ని మదనపల్లె శాసన సభ్యులు షాజహాన్ భాష, వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎన్ సేతు, తంబళ్లపల్లె తెలుగు టిడిపి నియోజక వర్గ ఇన్చార్జ్ శంకర్ యాదవ్ తోపాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, ఆదికారులు, స్వామివారి భక్తులు, ప్రజలు స్వామివారిని దర్శనార్థం ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, కృపాకటాక్షానికి పాత్రు లయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వామి వారి కృపాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, కరువు పరిస్థితులను అధిగమించి పచ్చదనంతో ప్రజలు సంతోషంగా ఉండేందుకు వర్షాలు సమృద్ధిగా కురిపించేలా చూడాలని ప్రార్థించారు.ఆలయ అభివృద్ధికి మెరుగైన వసతుల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామ న్నారు.



