మట్టి వినాయకుని విగ్రహాలే పూజిద్దాం.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min read
మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: మట్టి వినాయకుని విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రజలను కోరారు. కర్నూలు నగరంలోని వెంకటేష్ థియేటర్ ప్రక్కనున్న పాత గోశాల వద్ద గాయత్రి గోసేవ సమితి ఆధ్వర్యంలో వేముల రమేష్ ఉచితంగా మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పాటు పాతబస్టాండులో వాసవీ ఏజెన్సీస్ యజమాని శేషఫణి మట్టి వినాయకుని విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి టి.జి భరత్ పాల్గొని ప్రజలకు విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలు పూజిస్తే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందన్నారు. తమ టీజీవీ సంస్థల తరఫున కర్నూలు నగరంలో మట్టి వినాయకుని విగ్రహాలే పూజించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కుల, మతాలకు అతీతంగా కర్నూల్లో అన్ని పండుగలు ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

